Relevance of science and religion సైన్స్, మతమూ రెండూ అవసరమే-Andhrajyothy daily 11.02.2011
Posted by Nagasuri on Saturday, February 12, 2011చాలా సందర్భాలలో సైన్స్తో మతాన్నీ, దేవుడిని ముడిపెట్టి వ్యాఖ్యానిస్తుంటారు. సైన్స్ చెప్పలేనిది ఆధ్యాత్మికత వివరిస్తుందనీ, దేవుడు సైన్స్కు అతీతమని సైతం వివరిస్తూ ఉంటారు. ఐన్స్టీన్, శంకరాచార్యులు చెరో దారిన బయలుదేరి అన్వేషిస్తూ చివరకు ఓ చోట (సదరు బాబా పాదాల చెంత) కలిశారని కూడా కొన్నిచోట్ల వినబడుతూ ఉంటుంది. మతం లేని సైన్స్ గుడ్డిది, సైన్స్ లేని మతం కుంటిది అని మహా శాస్త్రవేత్త ఐన్స్టీన్ వ్యాఖ్యానించారని కూడా కొందరు గుర్తు చేయవచ్చు.
వాస్తవానికి మతాన్ని గానీ, దేవుడనే భావనను గానీ వివరించి చెప్ప డం సైన్స్ పనికాదు. దేవుడు ఉన్నాడని గానీ, లేడని గానీ సైన్స్ చెప్పదు. దేవుడు ఆధారంగా ప్రారంభమయ్యే మతం గురించి సైన్స్ చెప్పే అవకా శం అసలు లేదు. మనిషి అనుభవంలోకి వచ్చిన వాటిని వివరించేది సైన్స్. లేదా మనిషి తన పరిధిలో తెలుసుకునే విషయ పరంపరను హేతుబద్ధం గా సైన్స్ వివరిస్తుంది. తెలియని వాటికి ఆదిమానవుడు భయపడేవాడు. రాత్రి ఎందుకు ఏర్పడుతుందో, వర్షం ఎప్పుడు కురుస్తుందో, గ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలిసేది కాదు. ఇవి బోధపడనటువంటి కాలంలో ఇటువంటి విషయాలతో ముడిపడి మత సంబంధమైన, పురాణగాథలు అన్ని దేశాల్లో ప్రచారంలో ఉన్నాయి.
ఇక్కడ మరో అంశం గురించి చెప్పుకోవాలి. సైన్స్ రావడంతో చాలా అపోహలు పటాపంచలయ్యాయి. అపోహలతో ఆధారపడి జీవనోపాధి సాధించుకుంటున్న వారికి ఇటువంటివి సహజంగా ఆనందం కలిగించవు. ఫలితంగా వీరు సైన్స్ అవగాహనను వ్యతిరేకించడం కూడా ఉంటుంది. ఉద్రేకపరులు, ఉత్సాహవంతులు ఇరువైపులా ఉంటారు. సైన్స్ రాకతో మతం పలాయనం చిత్తగించిందనే వ్యాఖ్య ఇటువంటి సందర్భాలలోనే వినబడుతూ ఉంటుంది. కేవలం ఇటువంటి సందర్భంలోనే 'సైన్స్-మతం' సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు తారసపడుతూ ఉంటాయి.
ప్రకృతిలోని దృగ్విషయాలను వివరించడంతో సైన్స్ మొదలవుతుంద ని మొదటే చెప్పుకున్నాం. ప్రకృతి అంటే కంటికి కనపడే దాని నుంచి కన్ను చూడలేని దూరం దాకా వ్యాపించిందని మనకు తెలుసు. అలాగే కన్ను చూడలేని దానిని కూడా కొట్టి వేయలేం. ఇక్కడే టెలిస్కోప్ వంటి పరికరా లు మనిషికి దోహదపడతాయి. స్థూల జగత్తును మాక్రో వరల్డ్ అనీ, సూక్ష జగత్తును మైక్రో వరల్డ్ అని పేర్కొంటుంటాం.
సైన్స్-మతం గురించి ప్రస్తావించుకున్నప్పుడు మరో పార్శ్వం ఉంది. దయ, ప్రేమ, సహనం, కారుణ్యం వంటి మానవీయ భావనలను సైన్స్ వివరించజాలదు. ఈ గుణాల అవసరం గురించి మతం చాలా స్పష్టంగా చెబుతూ ఉంటుంది. ఈ గుణాలు మనుషులలో ఎందుకు ఉన్నాయో, లేదా ఎందుకు లేవో లేదా ఎందుకు తగ్గుతున్నాయో-సామాజిక శాస్త్రాలు చెప్పవచ్చు. కానీ విజ్ఞాన శాస్త్రాలు ప్రస్తుతం వివరించే అవకాశం లేదు. సైన్స్ తనకు తెలిసింది వివరిస్తుంది. అంతే! సైన్స్ పరిధిలో లేని దేవుడి గురించి వివరించమనడం అర్ధరహితం.
అందుకే బుద్ధుని వంటి తాత్వికు లు దేవుడు ఉన్నా, లేకపోయినా మనం పట్టించుకోనక్కర లేదు అని భావిస్తారు. కేవలం సాటి మనిషి,అతడి సంక్షేమం ప్రధానమని కూడా బుద్ధుడు బోధించాడు. అంతేకాదు 'శాస్త్రీయ దృక్పథం' అనే దానికి బుద్ధుడు 2500 సంవత్సరాల కిందట చెప్పిన విషయాన్ని నిర్వచనంగా ప్రపంచం అంగీకరించింది.
అదే సమయంలో మత విశ్వాసాలు గల సమాజాన్ని దూషించడం కూడా సైన్స్ పనికాదు. దేవుడు, మతం అనే వాటిని తిరస్కరించడం కూడా తగదని కొందరంటారు. మనంచేసే పనుల గురించి, వాటి ఫలితా ల గురించి ఎక్కువ ఆలోచించడం, ఆశించడం కూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా ఎక్కువ ఆశిస్తే, నిరాశ ఎదురయినపుడు తీవ్రం గా క్షోభకు లోనవుతారు. ఇటువంటి సందర్భాలలో బరువు దించుకునే ఉపకరణంగా దేవుడనే భావన దోహదపడాలి.
ఇక్కడ చిన్న ఉదాహరణ ఉంది. అడవిలో కట్టల మోపుతో వస్తున్న మనిషికి సాయం చేయడానికి తోడు ఎవరూ ఉండరు. కానీ ఆ వ్యక్తికి దాహం వేయవచ్చు, లేదా ప్రకృతి కార్యం సంబంధాల అవసరం ఏర్పడవచ్చు. మరి అటువంటి సమయం లో పరిష్కారం ఏమిటి? అందుకే ఆరడుగుల రాతి స్తంభం నాటుతారు అక్కడక్కడ. దానికి రెండు మూడు మెట్లు కూడా ఉంటాయి.
మనిషి ఎత్తు బట్టి ఎక్కడో ఒక చోట నిలబడి ఆ రాతి స్తంభం మీద మోపును జొనిపి పెట్టవచ్చు. పని అయిన తర్వాత, అలాగే ఆ మోపును నెత్తి మీద పెట్టుకోవచ్చు. ఈ ఏర్పాటు 'శుమైతాంగి' అని అంటాడు. చాలా అందంగా కనబడుతుంది ఈ పదం. అడవిలో ఉండే ఈ 'శుమైతాంగి' ఏర్పాటు వంటిది దేవుడనే భావన. మనిషి తనకుండే మానసికమైన బరువును దేవుడి మీద ఉంచవచ్చు. అవసరం లేని వారికి అవసరం లేదు. అడవిలో ఉండే 'శుమైతాంగి'ని అంద రూ వాడాలని లేదు.
కానీ అవసరమైన వారికి ఇది ఎంతో దోహదపడుతుంది. దేవుడనే భావన కూడా అంతే! అదే సమయంలో దేవుడు, మతం భావనల ఆధారంగా అర్థంలేని నమ్మకాలనూ, ఆచారాలను అంగీకరించనవసరం లేదు. వాటిని విడమర చి చెప్పడం అనే పనిని సైన్స్ వాదులు స్వీకరించవచ్చు. ఎందుకంటే సర్వమానవాళి సంక్షేమాన్ని సైన్స్ కోరుకుంటుంది కనుక. సున్నితమైన ఈ తేడాను గమనించకుండా పరుషంగా ఇరువర్గాలు పరస్పరం దూషించుకోవడం అర్ధరహితం. నిజానికి సమాజానికి ఈ రెండింటి అవసరం ఎంతో, ఎలానో తెలుసుకుని అంత వరకే వాడుకునే అప్రమత్తత మనిషికి చాలా అవసరం. అటువంటి ఆలోచనా ధోరణి నేడు ఎంతో ప్రయోజనకరం.
-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
Aditya sinha's stint as editor in the new indian express
Posted by Nagasuri on Tuesday, February 1, 2011Labels: eevaram, Media, medianadi column, Nagasuri, Nagasuri Venugopal, Politics, Print, Review, Telugu, Venugopal, weekly column
Ombudsman at HMTV- A respectable initiative : Eevaram- 23rd Jan 2011
Posted by Nagasuri on Saturday, January 29, 2011గణితాన్ని విజ్ఞాన శాస్త్రాలలో మహారాణిగా పరిగణిస్తారు. నిజానికి గణితం అనేది సైన్స్కు పరిభాష. గణితాత్మకంగానే సైన్స్ అవగాహన సాగుతుంది. అలాగే భౌతికశాస్త్రం విశ్వం గురంచీ, దాన్ని నడిపే శక్తి గురించీ వివరిస్తుంది. అణువు నుంచి అంతరిక్షం దాకా భౌతికశాస్త్ర పరిధిలోకి వస్తాయి. అయితే పదార్థం అంతర్గత నిర్మాణం, చర్యల గురించి వివరించేది రసాయన శాస్త్రం.
ఆహారం, ఔషధాలు, ఇంధనం... ఇలా చాలా విషయాలను రసాయన శాస్త్రమే చెప్పాలి. మరో రకంగా చూస్తే తయారు చేయబడే అన్ని పదార్థాలు, సంగ్రహించబడే అన్ని పదార్థాల గురించి రసాయన శాస్త్రం వివరిస్తుంది. అందుకే రసాయన శాస్త్రాన్ని 'సెంట్రల్ సైన్స్' అని అంటారు. ఇక్కడ సెంట్రల్ అనే దాన్ని 'కీలకం' అని మనం అనువదించుకుంటేనే పూర్తి అర్థం బోధపడుతుంది. గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు ఎన్ని విషయాలు చెప్పినా, ఈ ప్రపంచం, జీవులు ఎందుకు కదులుతాయో అందుకే తొలి మూడింటిని భౌతిక శాస్త్రాలు అని పరిశీలిస్తే, మిగతా వాటిని జీవ శాస్త్రాలు అని అంటారు.
అసలు ఈ విషయాలు చెప్పుకోవడానికి సందర్భం ఉంది కనుకనే, ఈ ముచ్చట్లు! 1911లో మేడమ్ క్యూరీకి నోబెల్ బహుమతి రసాయన శాస్త్ర విభాగంలో లభించింది. అది ఆమెకు రెండవసారి! నిజానికి క్యూరి అంటే బహువచనం-పియరీ క్యూరి, మేరి క్యూరి దంపతులు. మేరి- పియరి క్యూరి విద్యార్థిని. వారు ప్రేమించుకుని 1860లో వివా హం చేసుకున్నారు. రేడియో ధార్మికత గురించి వీరిరువురు పరిశోధిం చి థోరియం రేడియో ధార్మిక మూలకంగా కనుగొన్నారు. తర్వాత 1898లో వారు పొలోనియం, రేడియం అనే మూలకాలను కనుగొన్నారు.
ఈ కృషికి వారు 1902లో నోబెల్ బహుమతిని కలిసి అందుకున్నారు. అయితే 1906లో పియరి క్యూరి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రేడియో ధార్మిక పరిశోధనల కారణంగానే మేరికి క్యాన్సర్ వచ్చిందని భావన. మేరి కుమార్తె ఐరిన్, మేరి సహాయకుడు ఫ్రెడిరిక్ జూలియట్ ను వివాహమాడింది. వారిరువురు 1935లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. వీరు కూడా రెండు సంవత్సరాల వ్యవధి లో (1956, 1958 లలో) క్యాన్సర్తో మరణించారు. మూడు నోబెల్ బహుమతులు సాధించిన నలుగురి కుటుంబం ఇది.
నిజానికి మేరి క్యూరి జీవితం గమనిస్తే ఒక జానపద కథలాగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతులేని స్ఫూర్తిని మిగుల్చుతుంది. రసాయ న శాస్త్రం ప్రాధాన్యం పట్ల, అవసరం పట్ల అవగాహన తగ్గుతున్న సమయంలో మేరి క్యూరి సైన్స్ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ 2011 సంవత్సరంను 'అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరం'గా గుర్తించారు. మేరీక్యూరి విజయానికి శత వార్షికమని స్ఫురిస్తూ ఈ అంతర్జాతీయ సంవత్సరం ప్రకటించబడింది. రసాయన శాస్త్రం విజయాలను ప్రస్తుతిస్తూ, మానవ జాతికి అది చేసిన మహత్కార్యాలను గుర్తుచేస్తూ 2011 సంవత్సరం కార్యక్రమాలు సాగాలని 'అంతర్జాతీయ రసాయన శాస్త్ర సంవత్సరం' నిర్ణయించింది.
మనకు తెలిసిన జగత్తు అంతా ఘన, ద్రవ, వాయు రూపంలోనే ఉంటుంది. రసాయన శాస్త్ర అపరమైన అవగాహన బట్టే మనకీ ప్రపం చం బోధపడుతుంది. నిజానికి అన్ని జీవ వ్యాపారాలూ (క్రియలు) రసాయన చర్యల ద్వారానే నియంత్రించబడతాయి. అయితే అన్ని శాస్త్ర విభాగాల లాగానే రసాయన శాస్త్రాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది ఇలానే కొనసాగితే రసాయన శాస్త్ర పురోగతి మాత్రమే కాకుండా, మానవ కోటి భవిష్యత్తు కూడా గాయపడుతుంది. విజ్ఞాన శాస్త్రాలలో కీలక స్థానాన్ని ఆక్రమించిన రసాయన శాస్త్రం విజ్ఞానపు పార్శ్వాన్ని, కళాత్మక కోణాన్ని మరింత విపులంగా గుర్తుచేయాలని రసాయన శాస్త్రజ్ఞుల ప్రపంచం తహతహలాడుతోంది.
ముఖ్యంగా బాల బాలికలలో రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి కలిగించాలని ప్రధానం గా భావిస్తున్నారు. కెమిస్ట్రి క్లాసంటే బోరు అని ఎంతో మంది బాలబాలికలు భావించడానికి కారణం ఎవరో తెలుసా? అలా బోధించే మన ఉపాధ్యాయులూ, మన బోధనా విధానాలూ! ఇది భవదీయుడి అభిప్రాయం కాదు. డాక్టర్ పి.ఎస్.ఎన్. రావు వంటి ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడి ఆలోచనా సరళి. దీని గురించి కూడా ప్రస్తుతం మనం దృష్టి పెట్టాలి. ఇక్కడ విజయం సాధిస్తే, మరింత గొప్ప పరిశోధనకు ద్వారాలు తెరుచుకొంటాయి.
వాస్తవానికి మారిన విజ్ఞాన పరిస్థితుల్లో రసాయన శాస్త్రం పరిధి అంతులేనిది. జీవశాస్త్రపు లోతులు చూడటానికి రసాయన శాస్త్రం ఒక దివిటీలాగా దోహదపడుతుంది. ఆరోగ్యం, రోగం గురించి బోధపడాలంటే జన్యు స్థాయిలో రసాయన ప్రక్రియలు అవగతం కావాల్సి ఉంది. 2009 సంవత్సరం రసాయన శాస్త్రపు నోబెల్ బహుమతి భారతీయ సంతతికి చెందిన వెంకట్రామన్ రామకృష్ణన్కు వచ్చింది. ఇదే కాదు, ఇటీవల నోబెల్ బహుమతులన్ని,జీవవ్యవస్థల రసాయన ధర్మా లు వివరించడానికే కేటాయించబడ్డాయి. ఆరోగ్యం, పర్యావరణం వం టి వాటికి సంబంధించి పూర్తి సమాచారం కావాలంటే రసాయన శాస్త్రం ఎంతో అవసరం. ఈ రెండు అంశాలు ఆరోగ్యం, పర్యావరణం అనేవి మనగల అభివృద్ధిని సాధించే విద్యకు చాలా కీలకం. అటువంటి విద్యా సాధనకు ఐక్యరాజ్య సమితి ఒక దశాబ్దాన్ని ప్రకటించింది.
అందుకే రసాయన శాస్త్రాన్ని ఇష్టపడుదాం, అర్థం చేసుకుందాం, మరింత మంచి పరిశోధన చేద్దాం, మరింత అర్థవంతమైన, భద్రత గల భవిష్యత్తును రూపొందించుకుందాం. ఈ దిశలోనే 2011లో వివి ధ విజ్ఞాన శాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు రూపుదిద్దుకోవాలి. ఎందుకంటే రసాయన శాస్త్రం అనేది మన జీవితమూ, మన భవిష్యత్తూ కనుక!
-
సైన్స్ అంటే సత్యపథం, ఆశావాదం, కపటం లేని విధానం! ఈ విషయాలు పేర్కొనడానికి కారణాలున్నాయి. సైన్స్ ఆధారంగా ఏర్పడిన సంస్థలు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. సైన్స్ ద్వారా ఆరోగ్యం, ఆహారం, ఆయుష్షు సాధ్యం కావాలని శ్రమిస్తున్నాయి. అర్ధరహితమైన నమ్మకాలు, దోపిడీ సాగకూడదని భావిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా పాతుకునిపోయిన మూఢనమ్మకాలు ఇంకా విస్తరిస్తున్నాయి. కానీ తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి టెక్నాలజీ సైతం దోహదపడవచ్చు. అసంగతమైన నమ్మకాలకు పురిగొల్పే టీవీ సీరియళ్లు, కార్యక్రమాలు విరివిగా ప్రసారం కావడంలో టెలివిజన్ అనే టెక్నాలజీ పాత్ర చాలా ఉంది. దీనికి మించి కొత్త రకం సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి స్వరూపం గుర్తించే క్రమంలో బోల్తాపడకూడదు.
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఒక సదస్సు జరిగింది. దీని సారాం శం ఏమిటంటే మొబైల్ ఫోన్ల వాడకంతో సమస్యలు లేవనీ, అది కేవలం అర్ధరహిత ప్రచారమని. ఆ మేరకు మరుసటి రోజు పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ సదస్సును మొబైల్ కంపెనీలు ఖర్చుతో నిర్వహించారు. అందువల్ల ఏ గూటి చిలుక ఆ గూటి పలుకే వల్లిస్తుంది. ఈ వార్త ప్రచురింపబడిన రోజునే ఆరోగ్య కార్యక్రమంలో మొబైల్ఫోన్తో అనర్థాలు చాలా ఉన్నాయని టీవీ చానల్ ప్రసారం చేసింది. నిజానికి ఈ పరిస్థితిని కూల్డ్రింకులలో రసాయనాల అంశంతో పోల్చవచ్చు. శీతల పానీయాలలో రసాయనాలున్నాయని సహేతుకంగా రుజువైనా, ప్రచారం పుణ్యమా అని చాలామంది దాన్ని పూర్తిగా నమ్మడం లేదు. ఈ స్థాయిలో శీతలపానీయాల సంస్థలు ప్రచారాన్ని సాగిస్తున్నాయి.
శీతలపానీయాల లోగుట్టును వెలికి తీయడానికి స్వచ్ఛంద సంస్థలూ, సైన్స్ సంస్థలూ చాలా పాటుపడ్డాయి. కొంత విజయం సాధించాయి కూడా! తర్వాత సైన్స్ సంస్థలు ఈ విషయం పట్ల కాస్త వెనుకంజవేయ డం, దాంతో శీతల పానీయాల సంస్థలు ప్రచారాన్ని ఉధృతం చేయడం జరిగింది. అయితే మొబైల్ఫోన్ల వాడకం గురించి పెద్దఎత్తున అవగాహ నా కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. అంటే టెక్నాలజీ ముసుగున మన ఆరోగ్యం, ఉనికి మొదలైన వాటిని దెబ్బతీసే వాటిని గమనించడం సైన్స్ ఉద్యమశీలుర తక్షణ కర్తవ్యం. మొబైల్ బెడద కేవలం ఒకటి మాత్రమే కావచ్చు.
మరింత పరిశీలన చేస్తే మరిన్ని సమస్యలున్నాయని బోధపడవచ్చు. ఇటీవల కాలంలో గ్రహణం, శాంభవి, మరేదో మూఢనమ్మకం.. ఇలా ఏది సంభవించినా టీవీ చానళ్లలో అరగంటకు తక్కువ కాకుండా చర్చలు ప్రసారం అవుతున్నాయి. ఇందు లో ఉదయం పూట జ్యోతిష్యం చెప్పే పండితులు ఒక వాదనకు నేతృత్వం వహిస్తుండగా; సైన్స్ సంస్థల వ్యక్తులు వారితో విభేదిం చే చర్చలో పాల్గొంటారు. అనుసంధానంగా ఉండే సమన్వయకర్త మాటలకు ఆజ్యం పోస్తూ, మంటలు ఎగిసే చర్చ జరపాలని ప్రయత్నిస్తారు.
ఎటువంటి వెలు గు లేకుండా కేవలం వేడి జిమ్ము తూ చర్చ ముగుస్తుంది. ఇరు వర్గాల తీవ్ర స్వరాలు గుర్తుంటా యి. కానీ చర్చ చివరకు ఏమి చెప్పిందో గుర్తుకురాదు. శృతిమించిన వాదనలు పెరిగి కొందరిని టీవీ కట్టేసేట్టు చేయవచ్చు. ఈ సందర్భంగా ఒక కీలకమైన విషయం గల్లంతు కావడాన్ని ఎక్కువమంది గుర్తించలేకపోతున్నారు. ఇటువంటి చర్చల వల్ల సైన్స్ సంస్థలకు కొంత ప్రచారం లభించవచ్చు. ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా సాధ్యపడిన విషయం కూడా కావచ్చు. కానీ వీక్షకుల దృష్టిలో ఇలా విభేదించే వారిగా, గొడవపడే వారిగా సైన్స్ సంస్థల వ్యక్తులు గుర్తుండిపోవచ్చు.
కానీ సైన్స్ అంటే వీలయినంత ఎక్కువమంది దోహదపడే గొప్ప సాధనమని చెప్పలేకపోతున్నారని గమనించాలి. నిజానికి జ్యోతిష్యం, వాస్తు.. వంటివి ఉపాధి కల్పించే మార్గాలు. కానీ సైన్స్ ప్రచారం వంటివి హాబీగా సాగే పనులు. అందువల్ల మొదటి వర్గంవారు మరింత సంఘటితంగా, వ్యూహాత్మకంగా, లాఘవంగా సాగుతా రు. వారే ప్రచార మాధ్యమాలకు ప్రకటనలు కూడా ఇస్తారని గమనించా లి. కనుక ప్రసార మాధ్యమాలు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా సాగుతా యి. దీనితో సైన్స్ అసలు ప్రయోజనం కనబడకుండాపోతోంది. కానీ కొంత ప్రచారం మాత్రం మిగులుతుంది. సైన్స్లేని ప్రచారంతో ప్రయోజనం ఏమిటో ఆలోచించాలి.
మరోవైపు విలువైన రాళ్లు, శని యంత్రాలు, హనుమాన్ కవచాలు విశృంఖలంగా ప్రచారం పొందుతున్నాయి. ఇంకోవైపు అర్ధరహితమైన కథనాలు సైన్స్ కథనాలుగా రక్తికడుతున్నాయి. అంతకు మించి సైకాలజి, సైన్స్, ఆరోగ్యం అటూ అర్ధరాత్రికి ముందు విచిత్రమైన కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. ఈ తరహా అంశాల వల్ల ఏమి ప్రయోజనం ఉందో ఆలోచించాలి.
వీటిని విసర్జించాలని పోరాడేవారు ఎవరు? సైన్స్ సంస్థలకు ప్రచారం కల్పిస్తున్నారని ఇటువంటి పోకడలను ఉపేక్షించడం తగునా? అందుకే సైన్స్ ఉద్యమ సంస్థలను ఆలోచించమని కోరడం! ఎన్ని ప్రసార మాధ్యమాలు వచ్చినా, రాయడం అనేది చాలా మౌలికమైన అంశం. అది లేకుండా ఇతర మాధ్యమ రూపాలను మనం ఊహించ లేం. కానీ సైన్స్ రచయితలు ఎందరున్నారని ఎవరైనా అడిగితే చేతి వేళ్ల సంఖ్యను మించిన సంఖ్య రాకపోవడం నేటి విషాదం.
నలభై సంవత్సరాలలోపు సైన్స్ రచయితలు ఎవరైనా ఉన్నారా- అని ఎంతో మందికి సందే హం రావచ్చు. దీన్ని మరింత ముదరనిస్తే ముందు ముందు మరింత ప్రమాదం ముంచుకు రావచ్చు. కనుక సైన్స్ ఉద్యమ సంస్థలు నేడు పూర్తిగా దృష్టిపెట్టి, తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. లేకపోతే వాణిజ్య ఎత్తుగడలతో పోరాడుతూ, క్రమంగా ఆ వాణిజ్యానికే పావుగా మారిపోయే పరిస్థితి ఎదురుకావచ్చు!
-డా. నాగసూరి వేణుగోపాల్
మినీ ప్రపంచంగా మొబైల్ పుట్టుకురావడం మరో ప్రభంజనం. చాలా ఫలితాలను అరచేతిలో అలవోకగా సాధించ గలగడం ఇందులోని మర్మం. సంగీతానికి సంబంధించి టెక్నాలజీ సౌలభ్యాన్ని, ప్రచారాన్ని, ప్రభావాన్ని విశేష రీతిలో సాధించగలిగింది.
సెన్స్, టెక్నాలజీ కారణంగా కలిగే ప్రయోజనాల గురించీ, అలాగే మరోవిధంగా వాడితే కలిగే వినాశనం గురించీ చెప్పడానికి- కత్తితో పోల్చడం చాలా కాలంగా ఉంది. కత్తిని రెండు రకాలుగా వినియోగిస్తాం అని చెప్పడం ఉద్దేశ్యం. కానీ, ప్రయోజనాల గురించి చాలా సందర్భాలలో చెప్పకోవాల్సినంతగా మనం ఘనంగా చెప్పుకోవడం లేదేమో! ఒక సంగీతం విషయం తీసుకుంటే టెక్నాలజీ చేసిన దోహదం ఎంతో విస్మయాన్ని కలిగిస్తుంది.
తొలి దశలో సైన్స్ అనేది సంగీతం తీరుతెన్నులు తెలుసుకోవడానికి తోడ్పడితే, తర్వాతి దశలో టెక్నాలజీ సంగీతానికి శాశ్వతత్వాన్ని, విశేషమైన ప్రాచుర్యాన్ని కలిగించింది. టెక్నాలజీ సౌలభ్యాలు లేకపోతే గాయనీ గాయకులు ఇంత హాయిగా ప్రావీణ్యం చూసి ఉండేవారు కాదు. ప్రకృతిని అర్థం చేసుకోవడంతో సైన్స్ మొదలై, అనుకరించడంలో వర్ధిల్లుతోంది. మనిషి గళం నుంచి వాయిద్యాల సంగీత ధ్వనులు అర్థం చేసుకోవడానికి శబ్దానికి చెందిన విజ్ఞాన శాస్త్రం గొప్పగా సహకరించింది. అలా సహకరిస్తూ తాను ఎంతో వృద్ధి చెందింది కూడా! హైస్కూలు, ఇంటర్మీడియట్ స్థాయిలో సంగీత వాయిద్యాలు ఎలా పనిచేస్తాయో అని వివరించే అంశాలు పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఘంటసాల సాంస్కృతిక చైతన్య వేదిక ఇటీవల విజయవాడలో ఒకరోజు పాటు కార్యక్రమం నిర్వహించింది. అందులో టెక్నాలజీ ప్రభావం గురించి వివరించమని ఆహ్వానించినపుడు-ఈ విషయం గురించి మళ్లీ దృష్టిపెట్టాను. గ్రామఫోన్ రికార్డు ద్వారా ధ్వని ముద్రణ మొదలైంది. అదే తర్వాత టేపుగా మారింది. టేపుతో సౌలభ్యం ఉన్నా నాణ్యత మాత్రం గ్రామఫోన్దే. తర్వాత వచ్చిన కాంపాక్ట్ డిస్క్ నాణ్యతలో మాత్రం టేపు ను మించిపోయింది.
మరింత చిన్నదిగా మారి, విస్తారమైన సంగీతాన్ని దాచుకోగలిగింది. రేడియో రావడంతో గ్రామఫోన్కు రెక్కల గుర్రం లభించినట్టయింది. తర్వాత వచ్చిన క్యాసెట్ రికార్డర్ మరింత విరివిగా సంగీతం లభించేలా సమాజానికి దోహదపడింది. అలాగే సిడి ప్లేయర్ దాన్ని మింగేసి మరింతగా సంగీతానికి దోహదపడింది. తర్వాత ప్రవేశించిన ఎఫ్ఎం రేడియో ఇటు రేడియోలోని సౌలభ్యాన్ని, అటు సిడి ప్లేయర్లోని నాణ్యతను అందివ్వగలిగింది. అదే సమయంలో రేడియోతో కలిసిపోయిన టెలిఫోన్- వినేవారికి కావాల్సిన సంగీతాన్ని తక్షణమే అందివ్వ గలిగింది. ప్రజల అభీష్టాన్ని గౌరవించడానికి టెక్నాలజీ దోహదపడింది.
ఇదంతా దృశ్యరూపం నోచుకోని సంగీత పరిస్థితికి వివరణ. ఘంటసాల హయాంలో టీవీలూ, వీడియో క్యాసెట్లు రాలేదు. సినిమా పాట అంటే ఆకాశవాణి, గాయనీగాయకులు, సినిమా పేరు, సినిమా దర్శకుడు అని మాత్రమే పరిచయం. కేవలం చెవి ద్వారా మనసులో గీతం బోధప డి అర్థపరిమళం బుద్ధిని సోకే వెసులుబాటు ఉండేది. రేడియో స్థానాన్ని టీవీ ఆక్రమించిన తర్వాత గాయనీగాయకుల స్థానాన్ని నటీనటులూ, సంగీత దర్శకుల స్థానాన్ని కెమెరామెన్ ఆక్రమించారని వ్యాఖ్యానించినా తప్పు లేదు.
రేడియో స్వర్ణయుగం తెలియని వారికి నేడు టీవీలో కనిపించే నృత్యభంగిమలే, వర్ణశోభితమైన దృశ్యాలే గుర్తుంటాయి. దృశ్యానికుండే శక్తి అంతటిది. అప్పటి పరిస్థితే ఘంటసాలకు గొప్పగా లాభించింది. ఆయన వేలాది పాటలు పాడకపోయినా విశేషమైన గుర్తింపు లభించింది. అదే సమయంలో గొప్పగా వృద్ధి చెందిన టెక్నాలజీ నేటి గాయనీ గాయకులకు ప్రతిబంధకంగా కూడా మారిపోయిందని ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. పాశ్చాత్య సంగీతానికి టెక్నాలజీ తోడ్పాటు మరింత పెద్దది. టెక్నాల జీ లేకుండా పాశ్చత్య సంగీతాన్ని అసలు ఊహించలేము కూడా! రచన, గానం, నృత్యం, నృత్యదర్శకత్వం, సంగీత దర్శకత్వం అనేవి ఒకే వ్యక్తిలో కలిసిపోవడంతో పాటు మినుకుమనే, తళుకులూ, అలాగే సంగీతశాలలోని ఆధునికమైన సంగీతపు ఏర్పాట్లు విశేషంగా ఉంటాయి. అంతేకాదు గానం అనేది పరిసరాల మీదా, వాతావరణం మీద ఆధారపడుతుందని భావిస్తాడు. అందుకే ఉదయరాగాలు, సంధ్యారాగాలు అని వివరిస్తారు కూడా. ఇటువంటి పరిస్థితులను కృత్రిమంగా కల్పించే రీతిలో సంగీత ప్రదర్శనశాలలు రూపొందాయి.
కంప్యూటర్ రావడం, ఇంటర్నెట్ తోడవడం అనేది అగ్నికి ఆజ్యం పోయడం లాంటిదని చెప్పుకోవచ్చు. ఒక మహానది ద్వారా అనంత సాగరాన్ని చేరడం అనే భావన కూడా కలుగుతుంది. కంప్యూటర్ రాకతో సిడి, వీడియో, రేడియో, టీవీ, ఫోన్ అన్నీ కలగలిసిపోయాయి. మన దేశంలో ఇంకా కంప్యూటర్ చాలా మందికి అస్పృశ్యంగానే ఉంది. అక్షరాస్యత, ఆర్థిక పరిస్థితి ఇంకా అవరోధాలు గానే నిలిచి కంప్యూటర్ను దూరంగా ఉంచాయి. కంప్యూటర్, నెట్ ఎక్కువ మందికి చేరిననాడు మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. దానికి వాణిజ్యం తోడ్పడుతుంది.
మినీ ప్రపంచంగా మొబైల్ పుట్టుకురావడం మరో ప్రభంజనం. చాలా ఫలితాలను అరచేతిలో అలవోకగా సాధించగలగడం ఇందులోని మర్మం. సంగీతానికి సంబంధించి టెక్నాలజీ సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని, ప్రచారాన్ని, ప్రభావాన్ని విశేష రీతిలో సాధించగలిగింది. తాజా సాక్ష్యంగా చెప్పాలంటే టీవీ చానళ్ల ద్వారా వెలుగుచూసి, ప్రచారాన్ని పొందిన వర్ధమాన గాయనీ గాయకుల జాబితా గురించి పేర్కొనాలి. మరింత తాజా ఉదాహరణ ఏమిటి అంటే టీవీలో మారుమ్రోగుతున్న తెలుగు జానపద గీతాన్ని మీకు గుర్తు చేయాలి మరి!
-నాగసూరి వేణుగోపాల్
ఇరవయో శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక ప్రగతి అనూహ్యంగా ఉందని భావిస్తారు. గతం నుంచి వర్తమానంలోకి వస్తున్నప్పుడు ఈఅనూహ్యా లు వరసగా తారసపడతాయి. రేడియో, టెలివిజన్, సినిమా, టెలిఫోన్, ఉపగ్రహ కమ్యూనికేషన్లు, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ.. వంటి చాలా విభాగాలు ఇంతగా అభివృద్ధి చెందుతాయని, ఇంతగా ప్రభావాన్ని కలుగజేస్తాయని ఎవరూ ఊహించలేదు.
ఎలక్ట్రాన్ను ఆవిష్కరించిన జె.జె.థాంసన్ తన పరిశోధనకు ఫలితాలు పెద్దగా ఉండక పోవచ్చని భావించారు. కానీ పాదార్థిక పరిశోధనకు, ఎలెక్ట్రానిక్స్కూ తెరలేపింది ఈ ఎలెక్ట్రాన్ ఆవిష్కరణే! అలాగే గత దశాబ్దపు సాంకేతిక విజ్ఞాన ప్రభావాన్ని ఒక సారి అవలోకిస్తే-మరెంతో ఆశ్చర్యం కలుగుతుంది. అక్షరం చెరిగిపోలేదు గానీ అదృశ్య రూపంగా, అరూపంగా మారింది. ఉత్తరాలు, వ్రాత ప్రతులు తగ్గిపోయి మౌఖిక రూపంలో సాఫ్ట్ అవతారం ధరించింది. వివరంగా చెప్పాలంటే ఈ పదేళ్ళలో ఉత్తరాలు బాగా తగ్గిపోయాయి.
డిసెంబర్ నెల చివరి వారం అంటే తమకు ఉత్తరాల భారం పెరుగుతుందని పోస్టల్ శాఖ వారూ, ఆలస్యంగా వస్తాయని ప్రజలు ఆందోళన పడేవారు. ఆ స్థాయిలో గ్రీటింగ్ కార్డుల హడావుడి ఉండేది. ఇపుడంత లేదు. కానీ ఈ భారం నేడు సెల్ ఫోన్, ఇంటర్నెట్ల మీద పడింది. కంప్యూటర్, ఇంటర్నెట్కు సంబంధించి చాలా గొప్ప ఫలితం, ఎక్కువ ప్రయోజనకరమైన విశేషం- ఈ మెయిల్. ఎటువంటి జాప్యం లేకుండా సమాచారం పంపడమే కాదు, మన సమాచా రం మన దగ్గరే భద్రంగా ఉంచుకుని-కావాల్సిన వాళ్ళకు క్షణంలో పంపవచ్చు.
మరో రకంగా జిరాక్స్ ఖర్చును తగ్గించింది. ఇక షార్ట్ మెసేజ్ సర్వీ స్ (ఎస్ఎమ్ఎస్)తో సమాచారం కచ్చితంగా, త్వరగా అరచేతిలో వాలడం మన దేశానికి ఈ దశాబ్దపు వింతే! అదే సమయంలో ఇంగ్లీషు భయంకరంగా రూపు కోల్పోతున్నదని భాషా వేత్తలు ఆందోళన పడుతున్నారు. తెలుగు ఇంకా కంప్యూటర్ భాషగా విస్తరించలేదు కనుక, మనకా సమస్య లేదు. తెలుగు భాషకు ఇంత స్థాయిలో సాంకేతిక పుష్టి లభించినప్పుడు మనం ఇంకెంత స్థాయిలో తెలుగును దోష భూయిష్టం చేస్తామో తేలీదు! సరళీకరణ, ఉదారీకరణ ఫలితాలు వెల్లువయ్యింది - ఈ దశాబ్దంలోనే.
విమాన ప్రయాణం ఇదివరకు కాల్పనిక రచనలలో కూడా తక్కువగా ఉం డేది. కానీ నేడు అది చాలా సామాన్యమైపోయింది. అంతేకాదు, విదేశాలకు పోక, తర్వాత బంధువులు పోయి రావడాలు, అక్కడి పరికరాలు వగైరా గమనించడాలు, ఇక్క డ కూడా అలాంటివి రావాల ని కోరుకోవడాలు బాగా పెరిగింది. స్వంత వాహనాలు విషయానికి వస్తే 20వ శతా బ్దం చివరి దశాబ్దంలో స్కూటర్ పాతబడి పోయింది. ఈ దశాబ్దంలో కారు సహజమైపోయింది. లక్ష రూపాయలకు నానో కారు అనే విషయాన్ని సంచలనాత్మకంగా చర్చించారు. చర్చ ఉన్న స్థాయిలో కారు లేదన్నది వేరే విషయం.
అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలాగానే కంప్యూటర్ ఖరీదు తగ్గింది. ఈ విషయం చెప్పుకుంటున్నప్పుడు ఎటిఎంల గురించి చెప్పుకోకపోతే బావుండదు. ఎప్పుడు బడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ -బ్యాంకులో డబ్బులుంటే చాలు రాల్చుకోవచ్చు శ్రమ లేకుండా. ఇటువంటి దానికీ పాస్బుక్కు, చెక్కు, బ్యాంక్ టైమింగ్స్, వెయిటింగ్ విసుగు వంటి వాటితో కలసిన రోజులను పోల్చుకోండి -అప్పుడు తెలుస్తుంది టెక్నాలజీ సౌఖ్యం! సరిగ్గా ఇటువంటిదే టీవీ వినోదం. ఎటువంటి శ్రమ లేకుండా, ఖర్చు లేకుండా, కాలయాపన లేకుండా 'కావాల్సింది కావాల్సినంత' అనే స్థాయి లో టీవీ వినోదం విచ్చల విడిగా లభిస్తోంది.
దీన్నయితే అసలు ఊహించలేదు. దేశంలో ఐదువందలకు పై చిలుకు - ఒక లెక్కింపు ప్రకారం 503 - రకరకాల చానళ్ళతో ముందు ముందు 'టీవీ వైరాగ్యం' కూడా విరివిగా పల్లవించే పరిస్థితి రావచ్చు. టెక్నాలజీ వినియోగం బాగా పెరిగి, వీటి రూపకల్పనకు మూల భూతమైన విజ్ఞాన భావనలు, శాస్త్రీయ అభినివేశం పూర్తిగా అంతరించి పోయిందేమో అనే భయం కలుగుతుంది. శాస్త్రీయ దృష్టి సరే, ఇంగితం కూడా అంతర్ధానం అవుతోందనే భయం కలుగుతోంది.
ఇది ఒక వైపుకాగా, మరో వైపు ఆత్మ విశ్వాసం క్లాసులతోపాటు దేవాలయాలు, పూజలు, మొక్కులు వగైరాలు కూడా మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంతకుమించి విగ్రహాలు, బొమ్మలు, ఆచారాలు మరింతగా జనంలోకి చొచ్చుకువచ్చాయి. టెక్నాలజీ వాడకం పెరిగితే, దాని ద్వారా తారసపడే మోసాలు కూడా పెద్ద స్థాయిలో ఉంటున్నాయి. పురుషులందు పుణ్య పురుషులు వేరయా - అన్నట్టు నేరాలలో సైబర్ నేరాలు గొప్పవయా -అని చెప్పుకోవాలి. వీటిలో ప్రక్రియ ఎంత సరళంగా, లాఘవంగా ఉంటుందో జరిగే మోసం అంత భారీ స్థాయిలో ఉంటోంది.
అంతకుమించి సృజనాత్మకంగా ఉంటుంది. నిజానికి దీని గురించి ఎక్కువ చర్చిస్తే టెక్నాలజీ అంటే భయం పెరుగుతుందని భావించే వారు కూడా ఉన్నారు. నిజానికి సైబర్ నేరాలకు అవసరమైన చట్టాలు మరింత పకడ్బందీగా ఏర్పడుతున్న కాలమిది. వీటన్నిటితో పాటు, ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పట్ల విపరీతమైన మోజు పెరిగి మౌలిక విజ్ఞాన అంశాల పట్ల గౌరవం, అభిమానం తగ్గడం ఆందోళన కల్గిస్తోంది. బి.టెక్ వైపు ఉన్న హడావుడిలో బియస్సి వైపు దాదా పు లేదని డిగ్రీ కోర్సుల వివరాలు చెబుతున్నాయి
. ఇలా జరగడం ముందు ముందు మౌలిక పరిశోధనలనే దెబ్బతీస్తుంది. అందుకే పిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తి కల్గించాలనే కొంత ప్రయత్నం ఈ దశాబ్దంలో పెరిగింది. జాతీయ స్థాయిలో పేరొందిన ప్రయోగశాలలను చూసే అవకాశం ఇప్పుడు కల్గిస్తున్నారు. ఫలితంగా సైన్స్ పట్ల మరింత మక్కువ పెరగగలదని నమ్మకం. ఇక చివరగా తెలుగు పత్రికలలో పాపులర్ సైన్స్, సైన్స్ అంశాల శీర్షికలు, సమాచారం బాగా తగ్గిపోయింది ఈ దశాబ్దంలోనే.
సైన్స్ పుస్తకాల అమ్మకాలు గణనీయంగా తగ్గకపోయినా -పత్రికలలో సైన్స్ సమాచారం బాగా తగ్గిపోయింది. కేవలం వాణిజ్యపు లంకె ఉండే టెక్నాలజీ అంశాలు, కన్స్యూమర్ గూడ్స్ వంటి వాటికి సంబంధించి సమాచారం ఇస్తున్నారు. అలాగే వైజ్ఞానిక కల్పనా సాహిత్యానికి సంబంధించి తెలుగులో ఈ దశాబ్దంలో వచ్చిన చెప్పుకోదగ్గ రచనలు పెద్దగా లేవు.
-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
Phd (Journalism) from AU courtesy:Vaartha 20.12.2010
Posted by Nagasuri on Sunday, December 19, 2010Labels: Andhrajyothy, awards, Nagasuri, Nagasuri Venugopal
Labels: eevaram, Media, medianadi column, Nagasuri, Nagasuri Venugopal, Print, Review, Telugu, Venugopal, weekly column













